ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
కాంగ్రెస్ ప్రభుత్వ పునాదుల్లోనే సామాజిక న్యాయం
– స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని క్యాతంపల్లిలో పేదల ఇంటి కల సాకారమవుతోంది. మార్చి 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకాన్ని బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం ఎంపిడివో కార్యాలయ ప్రాంగణంలో నమూనా ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ – పేద ప్రజల కలలను రూపం దిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జనవరి 26న క్యాతంపల్లిని ఫైలెట్ గ్రామంగా ఎంపిక చేసి నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించామన్నారు. 130 మందికి ఇళ్లు మంజూరు కావడంతో పాటు రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాల ప్రయోజనాలు అందాయని వివరించారు.
ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగుల దాకా పరిమితంగా ఉండాలని సూచించిన కడియం, అధికార యంత్రాంగం బ్యాంకు లింకేజీలతో రుణాలు ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినమైనా సంక్షేమ పథకాలపై ఎలాంటి రాజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.
గత 15 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమైందని, తాను ఎమ్మెల్యే అయిన ఏడాదిలోనే రూ.800 కోట్ల అభివృద్ధి నిధులను సాధించానని తెలిపారు. రైతులకు మద్దతుగా క్వింటాకు రూ.500 బోనస్, ఏడాదిలోనే 21 వేల కోట్ల రుణమాఫీ, ఉచిత కరెంట్, 500కి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, డిఈ, తహసీల్దార్, ఎంపిడివో, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments