ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
-సోమిడి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమిడిలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చిందని, సరిపోను గన్ని బ్యాగులు ఉన్నాయా అని, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా, ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పుడు తేమశాతాన్ని చూస్తున్నారా, కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లను చేశారని అధికారులు, నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యంలో తాలు లేకుండా శుభ్రంగా ఉండాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలని, రవాణా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం అమ్మిన రైతుల వివరాలను వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో వారి ఖాతాల్లో అమ్మిన దాన్యం డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులు నిర్వాహకులకు, హార్వెస్టర్ యజమానికి పలు సూచనలు చేశారు. హార్వెస్టింగ్ యజమానులు యంత్రం ద్వారా వరికోత చేస్తున్నప్పుడు ధాన్యం శుభ్రంగా వచ్చేటట్టు చూడాలని అధికారులు వారికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, కాజీపేట తహసీల్దార్ బావ్ సింగ్, ఇతర అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Comments