కాప్రాలో గంజాయి అక్రమ విక్రయాలపై ఎస్టీఎఫ్ దాడులు
_మొత్తం 365 గ్రాముల గంజాయి స్వాధీనం
– నలుగురు నిందితుల అరెస్టు
కుషాయిగూడ , ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కాప్రా ప్రాంతంలో గంజాయి అక్రమ విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్టీఎఫ్ బీ టీమ్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి గంజాయితో పాటు వాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఎస్టీఎఫ్ బీ టీమ్ ఎస్సైలు నాగరాజు, జ్యోతి తమ సిబ్బందితో కలిసి కాప్రాలోని నేతాజీనగర్ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. అక్కడ గంజాయి అమ్మకాలు జరుపుతున్న మంద రాహుల్ను పట్టుకుని అతని వద్ద నుంచి 131 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అలాగే అదే కాప్రా పరిధిలోని వంపుగూడ ప్రాంతంలో మరో దాడి నిర్వహించి అక్కడ అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల వద్ద నుంచి 234 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఈ రెండు కేసుల్లో భాగంగా విశ్వనాథ్, మనోజ్, తనీష్, మంద రాహుల్లను పోలీసులు అరెస్టు చేశారు.ప్రాథమిక విచారణలో నిందితులు గంజాయిని మహారాష్ట్ర నుంచి ఒకరు, హైదరాబాద్లోని ధూళిపేట ప్రాంతం నుంచి మరోకరు తెచ్చి కాప్రా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చిల్లరగా విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.నిందితుల వద్ద నుంచి గంజాయి తరలింపుకు ఉపయోగించిన మూడు బైక్లు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న గంజాయిని కాప్రా ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు.గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


Comments