పట్టా పాస్బుక్ లేని రైతులకు యూరియా అందాలి
–యూరియా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
–ఎల్కతుర్తి బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్
ఎల్కతుర్తి. ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టా పాస్బుక్ లేకుండా వ్యవసాయం చేస్తున్న రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎల్కతుర్తి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్న రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ మరో భారంగా మారిందని విమర్శించారు.
గురువారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టా పాస్బుక్ లేని రైతులను పరిగణనలోకి తీసుకోకుండా యూరియా పంపిణీలో నిబంధనలు విధించడం అన్యాయమని అన్నారు. యూరియా యాప్లో సాంకేతిక లోపాల వల్ల నమోదు ప్రక్రియ సజావుగా సాగక రైతులు సహకార కేంద్రాల చుట్టూ గంటల తరబడి తిరగాల్సి వస్తోందని తెలిపారు.
పట్టా ఉన్నా లేకపోయినా పంటలు పండించే ప్రతి రైతుకూ ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు నమోదు చేసి, పాస్బుక్ లేని రైతులకు కూడా యూరియా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
పంట వేసే కీలక సమయంలో ఎరువులు అందకపోతే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఇందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన హెచ్చరించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.


Comments