విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.!
- రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా.
- ఎమ్మెల్యే రాగమయి.
సత్తుపల్లి, ఫిబ్రవరి 2 (తెలంగాణ ముచ్చట్లు):
విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ హామీ ఇచ్చారు. సోమవారం సత్తుపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎస్. కేశవరెడ్డి మాట్లాడుతూ, రిటైర్మెంట్ అనంతరం రావలసిన బకాయిలు ఆలస్యమవుతున్నందున విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హెల్త్ కార్డులు అందుబాటులో లేక కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందలేకపోతున్నామని, వెంటనే హెల్త్ కార్డుల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పెన్షన్ మొత్తం బ్యాంకు రుణాల ఈఎంఐలకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు, విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు ఏ.ఎస్. ప్రకాశరావు, అద్దంకి వెంకటరత్నం, వాణి, కమలకుమారి, సాంబశివరెడ్డి, యోగానంద్, బూరుగు దాసు, డి. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments