మైనార్టీ గురుకులాల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి..
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, జనవరి - 20 (తెలంగాణ ముచ్చట్లు)
జిల్లా మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే వారు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు.
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ( టీజీ ఎంఆర్పిఐఎస్) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో గురుకుల విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అర్హత కలిగిన మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుందని అన్నారు.
ఇంటర్మీడియట్ తో పాటు, 6, 7, 8 తరగతుల్లో ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అడ్మిషన్లకు సంబంధించి గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.డి. ముజాహిద్, తెలంగాణ మైనారిటీ విద్యాసంస్థల ప్రాంతీయ కో ఆర్డినేటర్ ఎం.జె. అరుణ కుమారి, గురుకుల పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments