ఐడిబిఐ బ్యాంకు సహకారంతో తాటికాయల ప్రైమరీ పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభం
రాంపూర్ ఐడిబిఐ బ్యాంకు సామాజిక సహకారం
ధర్మసాగర్,జనవరి07(తెలంగాణ ముచ్చట్లు):
ధర్మసాగర్ మండలం, తాటికాయల గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఐడిబిఐ బ్యాంకు రాంపూర్ శాఖ ఆధ్వర్యంలో 60వేలు విలువగల వాటర్ ప్యూరిఫైయర్ను అందజేసి, ఘనంగా ప్రారంభించారు. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి సమస్య ఉందని గమనించిన ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలత ఈ విషయాన్ని బ్యాంకు ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ప్రయత్నాలకు స్పందించిన బ్యాంకు యాజమాన్యం పాఠశాలకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ను అందించడం విశేషంగా నిలిచింది.
ప్రారంభ వేడుకలో రాంపూర్ ఐడిబిఐ బ్యాంకు మేనేజర్ రత్నాకర్, కాశిబుగ్గ శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, మహేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటానికి శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం చాలా ముఖ్యమని వారు తెలిపారు. నీటి మూలంగా వచ్చే వ్యాధులు తగ్గి, విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టగలుగుతారని వివరించారు.
గ్రామ సర్పంచ్ ననుబాల సోమక్క చంద్రమొగిలి, ఉపసర్పంచ్ పెసరు శివ, మాజీ సర్పంచ్ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి బ్యాంకు అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. విద్యా, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.
హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా మేరీ, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు వల్ల విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందుతుందని, ఇది పాఠశాల స్థాయిలో అత్యంత అవసరమైన సదుపాయమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఐడిబిఐ బ్యాంకు ప్రతినిధులకు శాలువాలతో సత్కారం చేసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభంతో పాఠశాలలో నిత్యం స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో ఆరోగ్యవంతమైన విద్యా వాతావరణం ఏర్పడిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు నవీన్, రాజు, కళ్యాణి, ఉషారాణి, వసుంధర, ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులురాజు, హేమలత, సీఆర్పీ రనుప తదితరులు పాల్గొన్నారు. 



Comments