ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.!
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్.
- పల్లెల్లో విస్తృత ప్రచారం చేయాలి.
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు.
సత్తుపల్లి, జనవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు సీఐటీయూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ వెల్లడించారు. బుధవారం ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్లో జరిగిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్మికులు దీర్ఘకాల పోరాటాలతో సాధించుకున్న హక్కులు, చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా లేబర్ కోడ్లు అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 8 గంటల పని విధానం అమలులో ఉండగా, దానిని తొలగించి పని గంటలను 11కు పెంచడం కార్మికులపై మోదీ ప్రభుత్వం చేసిన ద్రోహమని పేర్కొన్నారు. సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కూడా హరించారని, కనీస వేతనాలపై స్పష్టత లేకుండా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని పల్లె పల్లెలో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11, 12 తేదీల్లో లేబర్ కోడ్ల రద్దు, ఉపాధి హామీ చట్టం పేరును మార్చడం ద్వారా జాతిపిత మహాత్మా గాంధీని అవమానించడం సరికాదని నిరసనగా, అలాగే నల్ల రైతు చట్టాల రద్దు కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ ఐక్య కార్యాచరణతో జిల్లాలో నిర్వహించనున్న జీపు జాతా సభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి చలమాల విఠల్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు పెరుమాళ్ల మోహన్ రావు, శీలం నరసింహారావు, సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్, పిన్నింటి రమ్య, ముదాం శ్రీనివాసరావు, జిల్లా ఉపేందర్, ముత్తమాల ప్రసాద్, దొంగల తిరుపతిరావు, బండారు యాకయ్య, నవీన్ రెడ్డి, భూక్యా శ్రీను, కోటేశ్వరిజెల్లరపు మంగ, కొలికపోగు సర్వేశ్వరరావు, జిక్కుల కృష్ణ, రామదాసు, బషీర్, కళ్యాణ్, రాములు, సత్తెనపల్లి నరేష్, వసపొంగు వీరన్న, మల్లికార్జునరెడ్డి, పాపారాణి, బాధావత్ శ్రీను, గాలి వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.


Comments