పిల్లల భద్రతే లక్ష్యం.. బడి బస్సుల తనిఖీలు.
- సత్తుపల్లిలో 32 బస్సుల తనిఖీ.
- ప్రమాదాలకు అడ్డుకట్టే లక్ష్యంగా అధికారులు చర్యలు.
- మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె.ఎన్. శ్రీనివాసరావు.
సత్తుపల్లి, జనవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):
పిల్లల ప్రాణ భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బడి బస్సులపై విస్తృత తనిఖీలు చేపట్టారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం (జనవరి 1 నుంచి 31 వరకు)తో పాటు ఇటీవల చోటు చేసుకున్న పాఠశాల బస్సుల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా రవాణా అధికారి జగదీష్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి.
ఖమ్మం జిల్లాలో మొత్తం 764 వరకు ప్రైవేట్ విద్యాసంస్థల బడి బస్సులు ఉండగా, ఈనెల 18వ తేదీ వరకు విస్తృత స్థాయిలో తనిఖీలు కొనసాగనున్నాయి. భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె.ఎన్. శ్రీనివాసరావు, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డితో కలిసి స్థానిక ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 32 బడి బస్సులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బస్సుల స్థితిగతులు, డ్రైవర్ల లైసెన్సులు, హ్యాండ్ బ్రేక్, టైర్ల కండిషన్, అత్యవసర ద్వారాలు, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తదితర 24 అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి బడి బస్సుకు ప్రత్యేకంగా నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సత్తుపల్లి ఏంవీఐ పరిధిలో మొత్తం 147 బడి బస్సులు ఉండగా, ఈ తనిఖీ కార్యక్రమం ఈనెల 18వ తేదీవరకు కొనసాగుతుందని తెలిపారు. 
తనిఖీల అనంతరం లోపాలు గుర్తించిన బస్సులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, సమగ్ర నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.


Comments