ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
ఇంటింటికి సిపిఐ సభ సందేశం: దండి
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు)
భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న జరిగే బహిరంగ సభ జయప్రదం కోరుతూ గురువారం ఖమ్మంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బైపాస్ రోడ్డు సిపిఐ కార్యాలయం వద్ద ర్యాలీని సిపిఐ నగర కార్యదర్శి ఎసెకె జానిమియా జెండా ఊపి ప్రారంభించారు. సిపిఐ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ బైపాస్ రోడ్డు మీదుగా బస్ డిపో, మయూరిసెంటర్, పాత బస్టాండ్, జెడ్పిసెంటర్, ఇల్లందు క్రాస్ -రోడ్డు మీదుగా సిపిఐ కార్యాలయంకు చేరుకుంది. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ జనవరి 18న జరిగే సభ సిపిఐ వందేళ్ల పోరాటాన్ని మరోసారి ప్రజల ముందుకు తేనుందన్నారు. దశాబ్దాల పాటు సాగిన పోరాట చరితను నేటి తరానికి తెలియజేయడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ సభ దోహదపడుతుందన్నారు. లక్ష లాది మంది పాల్గొనే ఈ సభకు సిపిఐ నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా హాజరుకానున్నారని సురేష్ తెలిపారు. వందేళ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగే ఈ సభ సందేశాన్ని ఇంటింటికి ప్రతి వ్యక్తికి తెలిపే కార్యక్రమంలో భాగంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని సురేష్ తెలిపారు. ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, తాట వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, జిల్లా సమితి సభ్యులు గాదె లక్ష్మి నారాయణ, నూనె శశిధర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి -నానబాల రామకృష్ణ. నాయకులు వరదా నర్సింహారావు, తాటి నిర్మల, బోడా వీరన్న, జ్వాలా నర్సింహారావు, మమత, శంకర్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


Comments