రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం
ఎస్సై జగదీష్
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు)
రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తిరుమలాయపాలెం ఎస్ఐ జగదీష్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ఆర్టీసీ డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై తిరుమలయపాలెం పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..రోడ్డు భద్రతపై అవగాహన అత్యంత ముఖ్యమైన అంశమని, ఒక్క క్షణం అజాగ్రత్త, నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణమై ప్రాణం తీస్తుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్బెల్ట్ పెట్టుకోకపోవడం లాంటివి ట్రాఫిక్ ఉల్లంఘనలేనని తెలిపారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని,ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను వెంట తీసుకెళ్లాలన్నారు. కండీషన్లో ఉన్న వాహనాలనే డ్రైవ్ చేయాలన్నారు. మద్యం సేవించడం, సెల్ఫోన్ చూడడం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడించారు.


Comments