మల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తా నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 7 (తెలంగాణ ముచ్చట్లు):
మల్లాపూర్ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.బుధవారం మల్లాపూర్ డివిజన్కు చెందిన పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెమలి అనిల్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, వీధి దీపాల కొరత, పారిశుధ్య సమస్యలు, చెత్త సక్రమంగా తొలగించకపోవడం వంటి అనేక సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న నెమలి అనిల్ కుమార్, వాటిని ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ,“మల్లాపూర్ డివిజన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం. ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేస్తాం” అని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు నాయకులు, కార్యకర్తలుసమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వినిపించారు.


Comments