పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, జనవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ అభివృద్ధి మరియు సులభతర కార్యాలయం (డిఎఫ్ఓ), హైదరాబాద్ ఆధ్వర్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారుల కోసం ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని ఎన్ఎస్ఐసి జోనల్ కార్యాలయం, హైదరాబాద్లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకత అభివృద్ధి, మార్కెటింగ్ అవకాశాలు, ఎంఎస్ఎంఈకి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలు, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లపై ఉత్పత్తుల విక్రయం, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో క్యూఆర్ కోడ్ జనరేషన్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.కార్యక్రమానికి సుమారు 150 మంది పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులు హాజరుకాగా, ఈ సందర్భంగా 110 మంది లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ జనరేషన్ ప్రక్రియను విజయవంతం గా పూర్తి చేశారు.ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ మరియు కార్యాలయ అధిపతి సి. ఎస్. ఎస్. రావు మాట్లాడుతూ, పీఎం విశ్వకర్మ పథకం ద్వారా లభించే ప్రయోజనాల ను లబ్ధిదారులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. తమ ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ ఎంతో కీలకమని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎన్ఎస్ఐసి జోనల్ కార్యాలయం జనరల్ మేనేజర్ వి. సురేష్ బాబు మాట్లాడుతూ, ఎన్ఎస్ఐసి అందిస్తున్న వివిధ సహాయక సేవలు, శిక్షణ, మార్కెటింగ్ మద్దతు కార్యక్రమాలపై వివరించారు. లబ్ధిదారులు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ప్రోత్సహించారు.లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (కెనరా బ్యాంక్) సి. శివప్రసాద్ బ్యాంకింగ్ విధానాలు, రుణ ప్రక్రియలను వివరించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద లభించే రుణ సౌకర్యాలను వినియోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.అంతేకాకుండా లబ్ధిదారులుఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను తెలుసుకునేందుకు బహిరంగ చర్చా కార్యక్రమం నిర్వహించి, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. 


Comments