జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి హాజరైన జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని వెల్టూర్ గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామస్తుల సహకారంతో ప్రధాన చౌరస్తాల్లో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో పోలీసు శాఖ మార్గదర్శకత్వం అందించడం అభినందనీయమని తెలిపారు.జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ, పోలీసు శాఖ–ప్రజల మధ్య సమన్వయం బలపడితేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, సీసీ కెమెరాల ఏర్పాటు ఈ దిశగా మంచి ముందడుగని ఆమె అన్నారు.గ్రామాభివృద్ధి, భద్రత అంశాల్లో పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని గ్రామ నాయకులు జిల్లా ఎస్పీకి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెల్టూర్ సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, మాజీ వైస్ ఎంపీపీ సాక వెంకటయ్య, కొత్తకోట సీఐ రాంబాబు, పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి, గ్రామ నాయకులు , గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments