సేవలకే పరిమితమైన జర్నలిస్టులకు గౌరవం ఎప్పుడు?
సమాజానికి సేవ చేసిన జర్నలిస్టులకు గుర్తింపు కరువు
-- బండి రాజు జర్నలిస్ట్
వనపర్తి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):
సమాజానికి దర్పణంగా నిలిచే జర్నలిస్టులు నేడు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు, పాలకుల తప్పిదాలను ప్రశ్నించేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి పనిచేస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు, సత్కారం లభించడం లేదన్న భావన బలంగా వినిపిస్తోందని జర్నలిస్టు బండి రాజు అన్నారు.వర్షం, ఎండ, రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ వార్తలను అందిస్తున్న జర్నలిస్టులు, అధికారిక వేడుకలు మరియు సత్కారాల సందర్భాల్లో మాత్రం పక్కన పెట్టబడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ, వారికి కనీస గౌరవం కూడా దక్కకపోవడం జర్నలిస్టు వర్గంలో తీవ్ర నిరాశను కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..ఇలాంటి పరిస్థితుల్లో దేశ గౌరవం,ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అయినా జర్నలిస్టుల సేవలకు గుర్తింపు లభిస్తుందా? కనీసం ఈ గణతంత్ర దినోత్సవానికైనా సమాజానికి అంకితభావంతో సేవలందించిన జర్నలిస్టులకు గౌరవం దక్కుతుందా? లేక ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వారు ప్రశ్నించేవారిగానే మిగిలిపోతారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు జర్నలిస్టుల వర్గంలో తీవ్రంగా చర్చకు వస్తున్నాయి.ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా భావించే జర్నలిస్టుల పాత్ర అమూల్యమైనదైనా, వారి సేవలను గుర్తించి సత్కరించే బాధ్యత ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, సమాజం మొత్తం మీద ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Comments