కాకతీయ కాలం నాటి చిత్రాలను పరిరక్షించాలి
ధర్మసాగర్,ఫిబ్రవరి04(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో ఉన్న పురాతనమైన ముఖ్యనాథ స్వామి ఆలయంలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రాచీన చిత్రాలను ప్రభుత్వం పరిరక్షించాలని ప్లిచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి కోరారు. టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్యతో కలిసి ఆయన బుధవారం ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పిరినాథ స్వామి ఆలయం క్రీ.శ. 1116–1157 మధ్యకాలంలో కాకతీయ రాజు ప్రోలరాజు-2 భార్య ముప్పమాంబ నిర్మించారని, కాకతీయుల కాలం నాటి శిల్పకళకు అద్భుతమైన నిదర్శనంగా ఆలయ గోడలపై పంచతంత్ర కథలు, రామాయణ ఘట్టాలు తదితర దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. దురదృష్టవశాత్తూ పరిరక్షణ చర్యల లోపం కారణంగా చిత్రాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య మాట్లాడుతూ ఎనిమిది శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం ఇప్పటికీ రాష్ట్ర పురావస్తు శాఖ పరిరక్షణలోకి రాకపోవడం శోచనీయమని రాష్ట్ర పురావస్తు శాఖ స్పందించి ఆలయాన్ని, అరుదైన కాకతీయుల కాలం నాటి చిత్రాలను కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్ వ్యవస్థాపక చైర్మన్ శివసాని ప్రవీణ్ రవీంద్ర , గ్రామస్థులు పాల్గొన్నారు.


Comments