కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు):
రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వనపర్తి పట్టణంలోని 33వ, 24వ వార్డుల్లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా 33వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాధవి, ఎస్ఎల్ఎన్ రమేష్కు, అలాగే 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జయమ్మ – శ్రీనివాసులులకు తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే నిరుపేదల కోసం ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం సరఫరా, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా వనపర్తి పట్టణంలో 50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, 23 కోట్ల రూపాయల వ్యయంతో పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం వసతి గృహాల నిర్మాణం, రాజభవన్ పునరుద్ధరణ, గల్లీల్లో ఐమాస్ట్ లైట్ల ఏర్పాటు, గత పదేళ్ల పాలనలో మురికి కూపాలుగా మారిన కాలనీల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి కాలనీలను సుందరంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన స్పష్టం చేశారు.మరో ఎనిమిది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగి వనపర్తిని అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, యువకులు, మహిళలు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments