జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
ధర్మసాగర్,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మసాగర్లోని జెడ్పీహెచ్ఎస్ (బాయ్స్) పాఠశాలలో జనా విజ్ఞాన వేదిక, జెడ్పీహెచ్ఎస్ (బాయ్స్) సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయుడు కే.బి. ధర్మ ప్రకాష్ అధ్యక్షత వహించారు.
సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న తెలుగు ఉపాధ్యాయురాలు రాజమ్మ బాలికల విద్య ప్రాధాన్యత, సమాన అవకాశాలు, సాధికారత అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు విద్యతో పాటు ఆత్మవిశ్వాసం, స్వావలంబనను పెంపొందించుకున్నప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. బాలికల అభివృద్ధి కుటుంబం నుంచే ప్రారంభమవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు సురేష్, రామకృష్ణ, సుధీర్ రెడ్డి బాలికల హక్కులు, భద్రత, ఆరోగ్యం, సమాజంలో వారి పాత్రపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాలికలపై వివక్షను తొలగించి సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అన్నారు.
ప్రధానోపాధ్యాయులు కే.బి. ధర్మ ప్రకాష్ మాట్లాడుతూ బాలికల విద్యే బలమైన సమాజానికి పునాదిగా నిలుస్తుందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో సమానత్వ భావనను పెంపొందించడంతో పాటు బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుతాయని తెలిపారు.


Comments