అభివృద్ధిలో పాలేరు నంబర్ వన్..!
● పేదల పాలిట ఆపద్బాంధవుడు మంత్రి పొంగులేటి
● 109 మందికి రూ.38.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
● మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మార్గనిర్దేశంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తుందని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో తిరుమలాయపాలెం మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 109 మంది బాధితులకు రూ.38.70 లక్షల విలువైన చెక్కులను అందజేస్తూ పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
- *సాగు, తాగునీటిలో అగ్రగామి..*
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవతో పాలేరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలు, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే తీర్పును పునరావృతం చేయాలని కోరారు.
- *అంకితభావంతో పనిచేయాలి..*
నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉంటే అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments