6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.
పులిచెర్ల స్వాతి గెలుపే లక్ష్యంగా విస్తృత పర్యటన.
సత్తుపల్లి, ఫిబ్రవరి 4 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలోని 6వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులిచెర్ల స్వాతి గెలుపు కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి నుంచి వందల కోట్ల రూపాయల నిధులు వస్తున్నా సత్తుపల్లికి తగిన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నా పట్టణ పరిస్థితి మారలేదని, ఇది ప్రజలపై జరిగిన అన్యాయమని పేర్కొన్నారు.
బీజేపీకి అవకాశం ఇస్తే ప్రతి రూపాయి ఖర్చుకు లెక్క చూపిస్తామని, సింగరేణి నిధులను ప్రజల అభివృద్ధికే వినియోగిస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లిని తెలంగాణలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. యువత ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, సింగరేణి నిధులతో పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విద్యా రంగంలో కేంద్రీయ విద్యాలయం, టెక్నికల్, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ, స్కిల్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైద్య రంగంలో మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రైల్వే లైన్, అన్ని మండలాలకు రోడ్లు, 24 గంటల నీటి సరఫరా, స్మార్ట్ సిటీ తరహా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. రైతుల కోసం రైతు బజార్, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Comments