మాయమాటలు, మోసపు మాటలతో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది
మాజీ ఎంపీ నామ
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు)
మాయమాటలు, మోసపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం మాజీ ఎంపీ, మాజీ బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామ నాగేశ్వరరావు విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి లతో కలిసి వైరా 5వ వార్డు బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి కట్టా స్వరూప రాణి, 6వ వార్డు సీపీఎం అభ్యర్థి మాదినేని రజిని, 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మాదినేని సునీత గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు అమలు సాధ్యం కాని ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ. 2500, పెన్షన్లు రూ. 4000, దివ్యాంగులకు రూ.6000 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆడబిడ్డల పెళ్లికి ‘కళ్యాణ లక్ష్మీ’, ‘షాదీ ముబారక్’ పథకాల కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించామని, దానికి తులం బంగారం కలిపి ఇస్తామని కాంగ్రెస్ చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందన్నారు. రైతులు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తాగునీరు, సాగునీరు, విద్యుత్ కోతలు లాంటి సమస్యలు లేకుండా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని టీడీపీ శ్రేణులు గుర్తుంచుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనేక చోట్ల టీడీపీ శ్రేణులు తమతో కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలోనే వైరా మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.


Comments