మున్సిపల్ ఎన్నికలు: ఫిబ్రవరి 11న స్థానిక సెలవు
ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ మను చౌదరి పిలుపు
మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీన స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.ఈ మున్సిపాలిటీల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు, దుకాణాలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సంబంధిత యాజమాన్యాలను ఆయన కోరారు.తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1988, ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1974 నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 11న ఉద్యోగులకు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటు హక్కు ప్రతి పౌరుని మౌలిక హక్కు కావడంతో ప్రతి ఓటరు తప్పకుండా ఓటింగ్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.


Comments