108–102 వాహనాల ఆకస్మిక తనిఖీ.
సేవల్లో వేగం, నాణ్యత పెంచాలి: కిరణ్ కిషోర్
సత్తుపల్లి, ఫిబ్రవరి 6 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ గ్రీన్ హెల్త్ సర్వీస్ మానవ వనరుల ముఖ్య అధికారి కిరణ్ కిషోర్ ఖమ్మం జిల్లాలోని 108, 102 (అమ్మ ఒడి), 1962 (పశు సంచార వాహనం) మరియు పార్ధివ వాహన సేవలకు సంబంధించిన వాహనాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల పనితీరు, ఉద్యోగుల హాజరు, సేవల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. నెలవారీగా నమోదవుతున్న కేసుల వివరాలతో పాటు జిల్లాలో స్థానికంగా నివసిస్తూ విధులు నిర్వహిస్తున్న అధికారుల పనితీరును సమీక్షించారు. వాహనాల్లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, మందులు, వాటి గడువు తేదీలను పరిశీలించి, ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి చేర్చాలని ఆదేశించారు. బంగారు గంట ప్రాముఖ్యతను వివరించిన కిరణ్ కిషోర్, వేగంగా స్పందిస్తూ మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. సేవల నిర్వహణలో చురుకుదనం చూపుతున్న జిల్లా మేనేజర్, కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ తనిఖీలో ఖమ్మం జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాలను ఇరవై నాలుగు గంటలు నిరంతరం పర్యవేక్షిస్తున్న కార్యక్రమ నిర్వాహకుడు షేక్ నజీరుద్దీన్ పాల్గొన్నారు.


Comments