ములకనూరు పశువైద్యశాలలకు రూ.1.40 కోట్ల నిధులు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో నూతన భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు.
భీమదేవరపల్లి, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏరియా పశువైద్యశాల, భీమదేవరపల్లి మండలంలోని ములకనూరు పశువైద్యశాలకు నూతన భవనాల నిర్మాణం కోసం రూ.1.40 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
పశుపోషక రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం.36, తేదీ 02-06-2026 ద్వారా అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్ ప్రాంతంలో పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పశుపోషక రైతులు తమ పశువులకు నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు ఆధునిక సదుపాయాలతో కూడిన భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రజా పాలన ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
నిధుల మంజూరుకు సహకరించిన రేవంత్ రెడ్డి మరియు వాకిటి శ్రీహరిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.


Comments