విద్యార్థుల సర్టిఫికెట్ల జాప్యంపై ఆందోళన.. తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం.
జమ్మికుంట టౌన్ జూన్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
ఉన్నత విద్య, స్కాలర్షిప్లు, కౌన్సెలింగ్ కోసం అవసరమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, విద్యార్థులకు నిర్ణీత సమయంలో సర్టిఫికెట్లు అందించాలని కోరుతూ జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కీర్తికి వినతిపత్రం అందజేశారు.
జమ్మికుంట మండలానికి చెందిన పలువురు విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, గత కొన్ని రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోందని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో వివరించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కొండపర్తి ప్రవీణ్, మహమ్మద్ అహ్మద్ పాషా, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Comments