ఆశలన్నీ అగ్నికి ఆహుతి రైతు విద్యాసాగర్కు తక్షణ సాయం అవసరం.
బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ .
ఎల్కతుర్తి, మే 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామానికి చెందిన రైతు మాటూరి విద్యాసాగర్ గత 20 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి పెంచుకున్న టేకువనం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భవిష్యత్తులో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఆశతో చెట్టు చెట్టును కాపాడుకుంటూ పెంచిన వందలాది టేకు చెట్లు క్షణాల్లో మంటల్లో కాలిపోవడం గ్రామస్థులను కలిచివేసింది.
స్థానికుల సమాచారం మేరకు ఒక్కసారిగా మంటలు చెలరేగి గాలివాన కారణంగా వేగంగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున టేకువనం దగ్ధమైంది. గ్రామస్తులు, స్థానిక యువకులు కలిసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే భారీ నష్టం సంభవించినట్లు తెలిసింది. ఈ ఘటనలో లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ రైతు మాటూరి విద్యాసాగర్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. 20 సంవత్సరాల పాటు కష్టపడి పెంచిన టేకువనం ఒక్కసారిగా బూడిద కావడం అత్యంత బాధాకరమన్నారు. రైతు తన కుటుంబ భవిష్యత్తుతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఎంతో సేవ చేశారని కొనియాడారు.
టేకు చెట్ల పెంపకం అనేది ఎంతో సహనం, సమయం, పెట్టుబడి అవసరమయ్యే పని అని పేర్కొన్న ఆయన, ఇలాంటి రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహించాలని కోరారు. చెట్ల పెంపకానికి రైతులు ముందుకు వచ్చేలా భద్రతా చర్యలు, బీమా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. రైతు మాటూరి విద్యాసాగర్కు ప్రత్యేక నష్టపరిహారం ప్రకటించి, తిరిగి టేకు మొక్కల పెంపకానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. “చెట్టు చెట్టుగా పెంచుకున్న ఆశలన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి” అంటూ రైతు విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


Comments