పినరై విజయన్పై ఈడి దాడులు రాజకీయ కక్షసాధింపే.!
సీపీఎం ఆధ్వర్యంలో నల్ల గుర్తులతో నిరసన ప్రదర్శన.
సత్తుపల్లి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ నివాసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి నిర్వహించిన దాడులను సీపీఎం తీవ్రంగా ఖండించింది. సీపీఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాత సెంటర్లో నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై కేంద్ర సంస్థలను ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వామపక్ష ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడిని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభించిందని, ఆ ప్రజాభిమానాన్ని తట్టుకోలేకే బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విధమైన బెదిరింపులు, దాడులకు వామపక్ష ఉద్యమం భయపడదని, ప్రజలతో కలిసి మరింత బలంగా పోరాడుతుందని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రావుల రాజబాబు, చెరకు రత్నకుమారి, గుదే రాము, పిల్లి నాయుడు, కోటయ్య, అర్జున్రావు, భాషా,
శివాజీ, భాస్కర్, వెంకటేశ్వరరావు, రమేష్, నాగేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Comments