దోపిడి కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్.
స్టేషన్ ఘనపూర్, మే 25 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ శివారులోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో ఉన్న సిరిరామ్ మోటార్స్ దుకాణంలో జరిగిన దోపిడి కేసులో మరో ముగ్గురు నిందితులను ఘనపూర్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్కు తరలించినట్లు సీఐ వేణు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున సుమారు 1:10 గంటల సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి సిరిరామ్ మోటార్స్ దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణ యజమాని బైరరామ్ను బెదిరించి ఒకచోట కూర్చోబెట్టి, దుకాణంలో ఉన్న 26 యాడ్ బ్లూ ద్రావక బకెట్లు, అతని పర్సు మరియు కౌంటర్లో ఉన్న రూ.10 వేల నగదును అపహరించి పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఘనపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అనంతరం మిగిలిన నిందితులలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ వేణు వెల్లడించారు.


Comments