విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.
ఎల్కతుర్తి, మే 22 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పరిధిలోని దండేపల్లి గ్రామం లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో లూజుగా
ఉన్న కరెంటు తీగలు ఒకదానికొకటి తగలడంతో స్పార్కులు ఏర్పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 20 ఎకరాల వరి గడ్డి కాలిపోగా, సుమారు 50 మామిడి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
బాధిత రైతు వద్దెల్లి అన్నారావు మాట్లాడుతూ గ్రామంలో చాలా చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందించలేదని ఆరోపించారు. వేసవి కాలంలో తీగల రాపిడి కారణంగా స్పార్కులు ఏర్పడి మంటలు వ్యాపిస్తున్నాయని తెలిపారు.
ఈ ప్రమాదంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.


Comments