పేదల జీవనాధారంపై కేంద్రం దాడి .
బీకేఎంయూ జిల్లా కార్యదర్శి కర్రె లక్ష్మణ్ .
ఎల్కతుర్తి, మే 19( తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) జిల్లా కార్యదర్శి కర్రె లక్ష్మణ్ విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కొత్త విధానాలు తీసుకురావడం ద్వారా పేదల ఉపాధి అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాల వాటాలు పెంచడం, మెటీరియల్ కాంపోనెంట్ అధికం చేయడం వల్ల పథకం అసలు లక్ష్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల్లో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలని కోరారు. కూలీలకు గిట్టుబాటు అయ్యే విధంగా దినసరి వేతనాలు చెల్లించడంతో పాటు, పని చేసే ప్రాంతాల్లో తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే విడుదల చేసి, పని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు మునిగాల భిక్షపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదునూరి వెంకటరాజం, రాష్ట్ర సమితి సభ్యుడు మద్దెల ఎల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టు భిక్షపతి, జిల్లా నాయకురాలు జూకంటి పద్మ తదితరులు పాల్గొన్నారు.


Comments