విధుల్లో కఠినత్వం.. క్రీడల్లో స్వర్ణ విజయం : ఏసిపి మాధవి
జమ్మికుంట టౌన్ మే 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నిర్వహించిన అఖిల భారతీయ పోలీస్ క్రీడా పోటీల్లో హుజూరాబాద్ ఏసిపి వి. మాధవి టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్ క్రీడాకారులు శనివారం ఆమె కార్యాలయానికి వెళ్లి శాలువాతో సత్కరించి, పూలగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాస్టర్ క్రీడాకారులు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించడమే కాకుండా, క్రీడల పట్ల ఆసక్తితో సాధన చేసి జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. ఏసిపి మాధవి మహిళలకే కాకుండా యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదిక అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మారేపల్లి మొగిలయ్య, అంతర్జాతీయ క్రీడాకారులు వంతడుపుల రఘు, డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), మంద జగన్, మామిండ్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments