పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ.
సత్తుపల్లి, మే 16(తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ బాలాజీ థియేటర్ మీదుగా ఓల్డ్ బస్టాండ్ వరకు కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మార్గనిర్దేశనం చేశారు. నాయకులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రిహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్పర్సన్ బొంతు సుమలత, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, చల్లగుళ్ళ నరసింహారావు, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు సందీప్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన నాయకులు పాల్గొన్నారు.


Comments