దళిత బంధు ఆలస్యంపై మండిపడ్డ బాధితులు.. చైర్మన్కు వినతి.
జమ్మికుంట టౌన్ మే 15 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్త మున్సిపల్ కార్యాలయం ముందు దళిత బంధు బాధితులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దళిత బంధు 2వ విడత నిధులను వెంటనే విడుదల చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్పందించిన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకంలో కొందరికి రూ.5 లక్షలు, మరికొందరికి పూర్తి స్థాయిలో నిధులు అందాయని తెలిపారు. ఇంకా కొంతమందికి 2వ విడత అందాల్సి ఉందని, సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికీ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, చంద రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments