శుభకార్యాల వేళ ఆయిల్ సంక్షోభం.!
Views: 94
On
సత్తుపల్లిలో పెట్రోల్, డీజిల్ తీవ్ర కొరత.
- బంక్ల వద్ద గంటల తరబడి క్యూలు.
సత్తుపల్లి, ఏప్రిల్ 26(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లిలో ఆదివారం సాయంత్రం నుంచే అన్ని పెట్రోల్ బంక్లలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో ఆయిల్ సంక్షోభం నెలకొంది. అవసరమైన సమయంలో సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వారం వివాహాలు, ఇతర శుభకార్యాలు అధికంగా ఉండటంతో పరిస్థితి మరింత విషమించింది. దూర ప్రయాణాలు చేసేవారు మధ్యలోనే నిలిచిపోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయిల్ దొరకక ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అత్యవసర పనులతో బయలుదేరిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని బంక్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున నుంచే వాహనదారులు బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఆయిల్ దొరకక పలువురు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొంతమంది రాత్రి వేళల్లోనే బంక్ల వద్ద కాచుకుని నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయిల్ కొరత ప్రభావం రోజు వారి జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు వాహనాలు నడపలేక ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు వాహనాలు దొరకక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు నిలిచిపోవడంతో సాగు పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన సరఫరా లేక రవాణా రంగం కుదేలవుతోంది. సరుకు రవాణా అంతరాయం కలగడంతో ధరలు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయిల్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
26 Apr 2026 21:45:06
దమ్మపేట, ఏప్రిల్ 26(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో...


Comments