ఇందిరమ్మ ఇళ్లతో గ్రామంలో పండుగ వాతావరణం
ఎల్కతుర్తి, ఏప్రిల్ 1( తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన గృహాల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. చిర్ర మౌనిక–నాగరాజు దంపతుల ఇంటిలో జరిగిన గృహప్రవేశ వేడుక గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ గారితో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిర్ర రాజయ్య, పప్పుల గంగాధర్, పొలాటి రాజేశ్వర్ రావు, కట్కూరి శ్రీలత–శ్రీనివాస్, గోళ్లేనా రాధికా–ఎల్లయ్యలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇందిరమ్మ కమిటీ మరియు పంచాయతీ కార్యదర్శి సహకారంతో సకాలంలో బిల్లులు మంజూరై నిర్మాణ పనులు పూర్తి కావడంతో తమ కలల ఇంటి సాధన జరిగిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గొలిపెల్లి సంపత్ మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ, లబ్ధిదారులు సమయానికి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేయడం అభినందనీయమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు మరింతగా ఉపయోగపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ఇతర లబ్ధిదారులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామమంతా ఆనందోత్సాహాలతో కళకళలాడింది.


Comments