గ్యాస్ సిలిండర్ మాయలో బంగారం దోపిడి… కందుగులలో కేటుగాళ్ల కుతంత్రం
హుజురాబాద్ టౌన్ మార్చ్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో కేటుగాళ్లు అమాయక మహిళను మోసం చేసి బంగారం అపహరించిన ఘటన కలకలం రేపింది. “గ్యాస్ సిలిండర్ వచ్చిందని” నమ్మబలికిన దుండగులు చాకచక్యంగా దోపిడీకి పాల్పడ్డారు.
గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మను ఒక వ్యక్తి ఇంటి బయటకు తీసుకెళ్లి, సిలిండర్ విషయమై మాట్లాడుతున్నట్టు నటించాడు. అదే సమయంలో మరో వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరని గమనించి లోపలికి వెళ్లి సుమారు నాలుగున్నర తులాల బంగారాన్ని అపహరించాడు. కొద్దిసేపటికే తిరిగి వచ్చిన ఆగమ్మకు ఇంట్లో దోపిడి జరిగిన విషయం తెలిసి షాక్కు గురైంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో పాల్గొన్న వ్యక్తులు గుర్తు తెలియని వారు కావడంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల మాటలు నమ్మకూడదని, ముఖ్యంగా ఇలాంటి మోసపూరిత పద్ధతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సంఘటనతో కందుగుల గ్రామంలో భయాందోళన నెలకొంది.


Comments