కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
_సుమారు రూ.8 లక్షల ఆస్తి నష్టం అంచనా
_ఘటనపై పోలీసులకు ఫిర్యాదు – దర్యాప్తు ప్రారంభం
కాప్రా, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Comments