భూగర్భ జలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు.కేంద్రీయ భూగర్భ జల బోర్డు, జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవా
రం మేడ్చల్–మల్కాజ్గిరి ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ శాఖల ఇంజనీర్లు, క్షేత్ర మరియు సాంకేతిక సహాయకులకు భూగర్భ జలాల సంరక్షణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ హాజరై మాట్లాడారు.భూగర్భ జలాల సంరక్షణపై శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల ఫలితాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చేయడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చన్నారు. స్వాతంత్ర్యం తరువాత పెద్ద ఎత్తున సాగు ప్రాజెక్టులు నిర్మించి నదీ జలాలను వినియోగించినట్టే, ప్రస్తుతం అంతరించిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకోవడానికి ఇంకుడు గుంతలు, నీటి కుంటలు వంటి నిర్మాణాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.సీజీడబ్ల్యుబి శాస్త్రవేత్త డాక్టర్ పండిట్ మధునూర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను సాంకేతికంగా ఎలా సంరక్షించుకోవాలి, వాటికి ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించవచ్చన్నారు.
సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్ బాబు భూగర్భ జలాల ప్రాముఖ్యత, పరిరక్షణపై ఉదాహరణలతో వివరించారు. మేడ్చల్ జిల్లా భూగర్భ జల స్థితిగతులను జిల్లా భూగర్భ జల అధికారి ఎం. హరీష్ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.ఈ సందర్భం గా కేంద్రీయ భూగర్భ జల మండలి మరియు జిల్లా భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన అక్విఫర్ మేనేజ్మెంట్ మరియు భూగర్భ జల గణన నివేదికలను అతిథులు విడుదల చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మాధవ్, యాదయ్య, రాంబాబు, అమన్ జైన్, భూగర్భ జల శాఖ అధికారులు సత్యనారాయణ, వంశీకృష్ణ, కార్తీక ప్రియ, కమల కుమారి, కార్తీక్, రాకేష్, పవన్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాంబశివరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments