ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ ప్రింట్ లేక గర్భిణీల ఇబ్బందులు
కుషాయిగూడ, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, స్కానింగ్ అనంతరం బిడ్డకు సంబంధించిన ఫోటో లేదా వివరాలు ఉండే పేపర్ ప్రింట్ ఇవ్వకపోవడం గర్భిణీలకు ఇబ్బందిగా మారింది.సాధారణంగా స్కానింగ్ చేసిన తర్వాత బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రింట్ ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ ఆ సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కానింగ్ రిపోర్టు ప్రింట్ లేకపోవడంతో గర్భిణీలు తమ వైద్య రికార్డులను పూర్తి స్థాయిలో పొందలేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.దీంతో కొంతమంది గర్భిణీలు ప్రైవేట్ స్కాన్ సెంటర్లకు వెళ్లి ప్రింట్లు తీసుకోవాల్సి వస్తోందని, దాంతో అదనపు ఖర్చు పడుతోందని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఈ సమస్య నెలకొనడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.స్కానింగ్ యంత్రానికి సంబంధించిన ప్రింటర్ లేదా పేపర్ సౌకర్యాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని గర్భిణీలు, స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.


Comments