ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశాలు
మేడ్చల్–మల్కాజిగిరి, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు జాప్యం లేకుండా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి డిఆర్ఓ (ఇన్చార్జి) చంద్రావతితో కలిసి అదనపు కలెక్టర్ మొత్తం 99 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హౌజింగ్ శాఖకు అత్యధికంగా 33 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మకంతో ఎంతో వ్యయప్రయాసలు పడి అధికారుల వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని, దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సూచించారు. తిరస్కరించే దరఖాస్తుల విషయంలో తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా అర్జీదారులకు వివరించాలని అధికారులకు సూచించారు.అలాగే స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్లైన్లో వెంటవెంటనే నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Comments