పరీక్షల ఒత్తిడిపై విద్యార్థులకు అండగా టెలిమానస్ సేవలు
మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన
మేడ్చల్ మల్కాజ్గిరి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు)
మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కొనసాగుతున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు టెలిమానస్ సేవలను విస్తృతంగా అందుబాటులో ఉంచామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వెల్లడించింది. పరీక్షల ఒత్తిడి, ఆందోళన, భయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉచితంగా 14416 మరియు 1-800-891-4416 హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల నుంచి మార్గదర్శకత్వం పొందవచ్చని అధికారులు తెలిపారు.విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రంలో టెలిమానస్ సేవలపై పోస్టర్లు ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే విద్యార్థులను ప్రత్యక్ష మానసిక ఆరోగ్య సేవలకు రిఫర్ చేసే సదుపాయం కూడా కల్పించామని తెలిపారు.పరీక్షల అనంతరం ఫలితాల సమయంలో కూడా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున టెలిమానస్ సేవలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సేవలను వినియోగించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ సి. ఉమా గౌరి సూచించారు.


Comments