ఖమ్మం రాజకీయాల్లో సరికొత్త సమీకరణం:
గులాబీ గూటికి సీపీఐ కీలక నేత తనయుడు?
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు)
జిల్లా రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. లెఫ్ట్ పార్టీల కంచుకోటగా ఉన్న ఖమ్మం రూరల్ మండలంలో సీపీఐ కి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. సీపీఐకి చెందిన ఒక జాతీయ స్థాయి అగ్ర నాయకుడి కుమారుడు త్వరలోనే భారత్ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకోనున్నట్లు, సదరు వ్యక్తితో స్వయంగా కేటీఆర్ ఏ మంతనాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
భారీ జన సమీకరణకు స్కెచ్
సాధారణ చేరికలా కాకుండా, తన బలాన్ని నిరూపించుకునేలా భారీ బహిరంగ సభ లేదా భారీ ర్యాలీ ద్వారా గులాబీ జెండా కప్పుకోవాలని సదరు నాయకుడు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం రూరల్ మండలంలోని తన అనుచరగణం, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.
బీఆర్ఎస్ వ్యూహం
ఖమ్మం జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని చూస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం, బలమైన సామాజిక వర్గం మరియు రాజకీయ నేపథ్యం ఉన్న నేతలను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే సీపీఐ నేత కుమారుడిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా రూరల్ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని భావిస్తోంది.
ఈ పరిణామంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది ఖమ్మం రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.


Comments