బంజారా కాలనీ లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు
కుషాయిగూడ, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ డివిజన్ లోని కృష్ణారెడ్డి నగర్ బంజారా కాలనీలో బంజారా వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, బంజారా సమాజానికి ధైర్యం, సాహసం, ఆధ్యాత్మిక చైతన్యం నింపిన మహనీయుడు శ్రీ సంత్ సేవాలాల్ నీ కొనియాడారు.1739లో రాయలసీమలోని గుత్తి ప్రాంతంలో అవతరించిన శ్రీ సంత్ సేవాలాల్ “ఏక్ జాత్, ఏక్ వాత్, ఏక్ సాత్” అనే భావనతో ప్రజలను ఏకం చేశారని తెలిపారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని, పూర్వీకులు అందించిన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.12 ఏళ్ల వయస్సులో భృగరాజు గురువు సమక్షంలో దీక్ష పొంది, జంతుబలులను నిరసిస్తూ భక్తి మార్గాన్ని ప్రజల్లో విస్తరించారని పేర్కొన్నారు. సబ్లీ పూజ, హోలీ వంటి పండుగల ద్వారా ధార్మిక చైతన్యాన్ని పెంపొందించిన ఆధ్యాత్మిక గురువుగా ఆయన నిలిచారని అన్నారు. మహారాష్ట్రలో సమాధి పొందిన శ్రీ సంత్ సేవాలాల్ సేవా నిరతి, ఆధ్యాత్మిక చింతనతో సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయిలు, కానిస్టేబుల్ జైపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు టిల్లు యాదవ్, మూర్తుజా, ప్రకాష్ రెడ్డి, జై, హీరాలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బంజారా వెల్ఫేర్ & యూత్ నాయకులు గుగులోత్ వెంకటేష్, శేఖర్, జి శంకర్, సురేష్, వినోద్, డి మల్లేష్, జి కుమార్, పిప్రశాంత్, ఎల్ రమేష్, జే. జయిల్ సింగ్, బి రాజేందర్, ఈ రాజేష్, ఈ సురేష్ తదితరులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.


Comments