మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు 330 ప్రత్యేక బస్సులు
ప్రతి 10 నిమిషాలకు ఈసీఐఎల్ నుంచి సర్వీసులు
– భక్తులకు టీజీఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
కుషాయిగూడ, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనుంది. కీసరగుట్టకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 330 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు కుషాయిగూడ డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు.శనివారం నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు సర్వీసు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను నేరుగా గుట్టపై ఆలయం సమీపం వరకు అనుమతిస్తారు. ప్రధానంగా ఈసీఐఎల్, సికింద్రాబాద్ (బ్లూ సీ హోటల్), వెంకటాపురం, ఉప్పల్, అఫ్జల్గంజ్, కోటి, నల్లకుంట, తార్నాక తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సురక్షితంగా ప్రయాణించాలని డిపో మేనేజర్ వేణుగోపాల్ కోరారు. మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున టీజీఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.


Comments