వల్భాపుర్ గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ
గ్రామ అభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ శ్వేత శ్రీనివాస్
ఎల్కతుర్తి, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్వేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శుభప్రదంగా, ఘనంగా నిర్వహించారు.
వేద మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించగా, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేత శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన, పారదర్శక సేవలు అందించేందుకు సౌకర్యవంతమైన, ఆధునిక సదుపాయాలతో కూడిన పంచాయతీ భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.
గ్రామ అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఉప సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రేణుక, కుమార్, శ్రీను, రాధ, కిషోర్, అరుణ, సునీత, నాగరాజు, ముక్క లావణ్య, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments