ఎల్కతుర్తి మండలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల దౌర్జన్యo
ఎల్కతుర్తి, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల అనుచిత ప్రవర్తన తీవ్ర ఆందోళనకు దారితీసింది. రుణ వాయిదాల వసూళ్ల పేరుతో సోమవారం రాత్రి ఆలస్యంగా కస్టమర్ల ఇళ్లకు వెళ్లిన సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బాధితుల వివరాల ప్రకారం, రాత్రి 9 గంటల తర్వాత ఇళ్లకు చేరుకున్న సిబ్బంది మహిళలు, కుటుంబ సభ్యుల సమక్షంలో అవమానకరంగా మాట్లాడి మానసిక ఒత్తిడికి గురిచేశారని తెలిపారు. అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడినట్లు వారు వాపోతున్నారు.
అంతేకాకుండా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తూ ఒత్తిడి తెచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో వసూళ్లు చేయడం చట్టవిరుద్ధమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి, మైక్రో ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళ వసూళ్లపై స్పష్టమైన నిషేధం అమలు చేయాలని కోరుతున్నారు.


Comments