సత్తుపల్లి–కల్లూరులో అధికార పోరు:13న తేలనున్న పీఠం.
- ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్.
- జిల్లాలో కల్లూరులోనే అత్యధిక శాతం నమోదు.
సత్తుపల్లి/కల్లూరు, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 28,830 మంది ఓటర్లలో 22,326 మంది ఓటు వేశారు. దీంతో 77.44 శాతం పోలింగ్ నమోదైంది. కల్లూరు మున్సిపాలిటీలో 18,866 మంది ఓటర్లలో 16,408 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 86.97 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోనే అత్యధిక పోలింగ్ శాతం కల్లూరులో నమోదవడం విశేషం.
సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించగా, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.
ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అధికార పీఠం ఎవరిని వరించనుందో అన్న ఉత్కంఠ పట్టణాల్లోనెలకొంది. రాజకీయ వర్గాలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


Comments