మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు
నాచారం, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని బండబావి ప్రదేశంలో రూ.9 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హైద్రాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలను కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. కార్పొరేటర్గా తన ఐదేళ్ల పదవీకాలం చివరి రోజున ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపన జరగడం తనకు గర్వకారణమని ప్రభుదాస్ తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరు ప్రక్రియలో కీలకంగా సహకరించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీకి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం బండబావి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నమూనా డిజైన్ను మంత్రి శ్రీధర్ బాబు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో కార్పొరేటర్ ప్రభుదాస్ ప్రాజెక్టు రూపకల్పన, క్రీడా వసతులు, నిర్మాణ దశల వివరాలను మంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments