ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలు
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 9(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లాలోని మునిసిపాలిటీలకు నిర్వహిస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం 5.00 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
ప్రచారం ముగిసిన అనంతరం అమల్లోకి వచ్చే ప్రచార నిషేధ కాలం ( సైలెన్స్ పీరియడ్) సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, మైక్లు, లౌడ్ స్పీకర్లు, ప్రచార వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు లేదా ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
అదేవిదంగా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఎలాంటి ఎన్నికల ప్రచారం, అభ్యర్థులకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా సందేశాలు పంపడం నిషేధమని తెలిపారు. ఈ అంశంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పోలింగ్ రోజు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగేలా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడం జరిగిందని, ఫ్లయింగ్ స్క్వాడ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్లను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ మద్యం రవాణా, నగదు పంపిణీ, బెదిరింపులు,శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సూచనలు చేస్తూ, ఎన్నికల నిబంధనలను గౌరవించి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు అధికారులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు.


Comments