చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
హన్మకొండ,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):
రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమని పేర్కొంటూ, చిన్నారిపై అమానుష నేరానికి పాల్పడిన శ్రీకాంత్, గణేష్లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఈ కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.
బాధిత చిన్నారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, సమాజంలో భద్రతా వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని డా. కడియం కావ్య స్పష్టం చేశారు.


Comments